‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తేలిపోయింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శనివారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన గత సినిమా ‘యానిమల్’లో రెండో హీరోయిన్ గా కనువిందు చేసిన త్రిప్తి దిమ్రీని ఇప్పుడు ప్రభాస్కు జోడీగా ఖరారు చేశారు సందీప్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం త్రిప్తి దిమ్రీ కు ఎంత పే చేస్తున్నారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు త్రిప్తి కు కేవలం నాలుగు కోట్లు మాత్రమే పే చేస్తున్నారు. అంతకు ముందు దీపికా పదుకోని 20 కోట్లు దాకా డిమాండ్ చేసిందని వినికిడి. అంతేకాకుండా ఆమె డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అదే త్రిప్తి దిమ్రీ అయితే డబ్బు తక్కువ, డిమాండ్స్ ఉండవని ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇదొక శక్తిమంతమైన పోలీసు కథతో యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు కానుంది. ఈ చిత్రం కోసమే ప్రభాస్ తొలిసారి పోలీసు యూనిఫాం ధరించనున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్తో కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.
దీనికి హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూరుస్తుండగా.. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది.